కేన్సర్‌ వ్యాధితో ఐసీయులో చనిపోయిన భార్య... తుపాకీతో కాల్చుకుని భర్త ఆత్మహత్య!!

వరుణ్

బుధవారం, 19 జూన్ 2024 (13:06 IST)
అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతిలో ఓ విషాదకర ఘటన జరిగింది. కేన్సర్ వ్యాధి సోకిన భార్య ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ కన్నుమూసింది. భార్య చనిపోయిందన్న వార్తను జీర్ణించుకోలేని భర్త.. ఐసీయూ వార్డులోనే భార్య శవం పక్కనే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... 
 
శిలాదిత్య చెతియా అనే అధికారి అస్సాం హోంశాఖ కార్యదర్శిగా పనిచేసేవారు. ఆయన 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన భార్య కొద్దికాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. గౌహతిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు నాలుగు నెలలుగా చెతియా సెలవులోనే ఉన్నారు. అయితే మంగళవారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు తుదిశ్వాస విడిచారు. 
 
'ఈ విషయం తెలిసిన వెంటనే చెతియా ఐసీయూ వద్దకు వచ్చారు. ఆమెవద్ద కొద్దిసేపు ఒంటరిగా ఉంటానని చెప్పి, అక్కడున్న వైద్యసిబ్బందిని బయటకు వెళ్లమని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మాకు తుపాకీ శబ్దాలు వినిపించాయి. వెళ్లిచూడగా.. ఆయన తన తుపాకీతో కాల్చుకున్నారు. మేం ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. తీవ్రంగా గాయపడటంతో చనిపోయారు' అని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
 
ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. 'భార్య అనారోగ్యంతో బాధపడుతున్నప్పటి నుంచి ఆయన ఆందోళనగా కనిపించేవారు. ఆమెవద్దే ఉండి బాగోగులు చూసుకునేవారు. ఇప్పుడు ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది' అని వెల్లడించారు. తీన్‌సుకియా, సోనిత్‌పుర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన శిలాదిత్య.. అస్సాం పోలీసు విభాగానికి చెందిన ఫోర్త్‌ బెటాలియన్‌కు కమాండెంట్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత  హోంశాఖ కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు