భుజంపై మువ్వన్నెల పతాకం ఉంది.. ఈ ప్రయాణంలో ఒంటరిని కాదు.. శుభాంశు శుక్లా

ఠాగూర్

గురువారం, 26 జూన్ 2025 (13:39 IST)
యాక్సియం-4 మిషన్‌లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీలోకి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి శుభాంశు శుక్లాతో సహా మొత్తం నలుగురు వ్యోమగాముల బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన విషయం తెల్సిందే. ఈ బృందం గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఐఎస్ఎస్‌తో అనుసంధానం కానుంది. ఈ బృందం అక్కడ 14 రోజుల పాటు ఉండి పలు కీలక పరిశోధనలు చేపట్టనుంది. దాదాపు 41 సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత ఒక భారతీయుడు అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  
 
ఈ నేపథ్యంలో అంతరిక్షం లైవ్‌కాల్‌లో శుభాంశు శుక్లా మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి అందరికీ నా నమస్కారాలు. తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది ఒక గొప్ప ప్రయాణం. 30 రోజుల క్వారంటైన్ తర్వాత ఇపుడు ఐఎస్ఎస్‌కు చేరబోతున్నాం. ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. తమతో పాటు జాయ్ అనే ఒక బేబీ హంస బొమ్మను కూడా తీసుకెళుతున్నామని, భారతీయ సంప్రదాయంలో హంస విజ్ఞానానికి ప్రతీక అని ఆయన వివరించారు. 
 
దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ లైవ్‌కాల్‌‍లో శుభాంశు శుక్లా తన అనుభూతులను వివరిస్తూ భారత రహిత స్థితికి ఇపుడిపుడో అలవాటు పడుతున్నారు. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా ఆహారం తీసుకోవాలి వంటి విషయాలను ఒక చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడ గడిపే ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై మన మువ్వన్నెల పతకాం ఉంది. అది చూసినపుడల్లా ఈ ప్రయాణంలో నేను ఒంటరిని కాదనని కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే ధైర్యం కలుగుతుంది అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు