దొంగబాబా.. పండ్లు ఇవ్వడానికి వెళ్తే.. బాలిక అలా కనిపించింది.. చివరికి..?

బుధవారం, 23 జూన్ 2021 (20:50 IST)
దొంగబాబాల ఆగడాలపై వార్తలు వస్తూనే వున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం ఇస్పూర్ తాండ గ్రామంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై దొంగబాబా అత్యాచార యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నేరేడిగోండ మండలం రాజుర గ్రామ శివారులో ఓ గుట్టపై 7 ఏళ్లుగా జాధవ్ ఆత్మారం (26) అనే వ్యక్తి ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు.
 
వేసవిలో ఆశ్రమం వద్ద నీటి వసతి లేకపోవడంతో ఇస్పూర్ తండా గ్రామస్థులు గ్రామం వద్ద అతనికి వసతిని ఏర్పాటు చేశారు. ఈ నెల 16న స్వామీజీకి పండ్లు ఇవ్వడానికి ఓ కుటుంబం తమ కుమార్తెను పంపించింది. ఎంతసేపటికీ బాలిక తిరిగి రాకపోవడంతో స్వామిజీ నివాసం వద్దకు తల్లితండ్రులు వెళ్లారు. అక్కడ వారికి తమ కుమార్తె స్పృహ కోల్పోయి కనిపించింది.
 
బాలికను వారు ఇంటికి తీసుకు వచ్చి చికిత్స అందించారు. ఆస్పత్రిలో కోలుకున్నాక బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పింది. గ్రామస్థులతో కలిసి తల్లితండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మారం స్వామీజీపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి