బీజేపీలో చేరిన గాడ్ ఫాదర్ ఎస్ఎం కృష్ణ: రమ్య కూడా కమలం తీర్థం పుచ్చుకుంటారా?

బుధవారం, 15 మార్చి 2017 (19:08 IST)
సినీ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు రమ్య త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనుంది. ఇప్పటికే గాడ్‌ఫాదర్ అయిన మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. బుధవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో రమ్య తోపాటు మరికొందరు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. 
 
కాంగ్రెస్ పార్టీ తరపున 2009 ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా రమ్య ఎన్నికయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరించారు. కన్నడ ప్రముఖ నటుడు, మాజీ మంత్రి అంబరీష్ కూడా ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కూడా బీజేపీలో బుధవారం చేరారు. ఈ క్రమంలో రమ్య కూడా బీజేపీలో చేరతారనే వార్తలో రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్నాయి. 
 
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనలేదని, కాంగ్రెస్ పార్టీనే స్వాతంత్ర్య తెచ్చిందని గతంలో రమ్య అన్నారు. అంతేగాక, పాకిస్థాన్ స్వర్గధామమంటూ ఆ దేశంలో పర్యటించిన అనంతరం రమ్య తెలిపారు. ఈ నేపథ్యంలో రమ్య ఒక వేళ బీజేపీలో చేరితే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మాండ్యా నియోజకవర్గానికి చెందిన మంజునాథ్ అనే బీజేపీ నేత బెదిరింపులకు గురిచేయడం సంచలనంగా మారింది. గతంలో బీజేపీని, ఆర్ఎస్ఎస్‌ను తీవ్రంగా విమర్శించిన ఆమెను పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి