హాసన్ నగర పోలీసు స్టేషన్ పరిధిలోని కిత్తనగర గ్రామానికి చెందిన విశ్వనాథ్ (28)కు ఆశ(25) అనే యువతితో ఈ యేడాది ఫిబ్రవరి 16వ తేదీన వివాహమైంది. విశ్వనాథ్ను పెళ్లి చేసుకుని మెట్టినింటికెళ్లి పొలం పనులు చేయడం ఆశకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరుక విశ్వనాథ్ చేత మెడలో మూడుముళ్లు వేయించుకుంది.
ఈ పరిస్థితుల్లో తన భర్తను స్నేహితుడి బర్త్డే పార్టీకి తీసుకెళ్లిన ఆశ... అక్కడ భర్తకు విషం మాత్రలు మింగించి విషపు ఇంజెక్షన్ వేసి, ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోయింది. పిమ్మట.. తన భర్త తనను పార్టీలో వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడంటూ నాటకం ఆడింది.
ఇంతలో స్పృహలోకి వచ్చిన విశ్వనాథ్ అతికష్టం మీద ఇంటికి చేరుకుని జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వెంటనే అతడిని హాసన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ తర్వాత మైసూరుకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.