సింధు ఒప్పందం రద్దు చేద్దామా.. ప్రధాని మోడీ కీలక చర్చలు

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (08:34 IST)
మానవతా దృక్పథంతో దాయాది దేశం పాకిస్థాన్‌కు తాగు, సాగు నీరు అందిస్తుంటే.. ఆ దేశం యురీ వంటి ఉగ్రవాద దాడులతో మన జవాన్ల రక్తం తాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడుతున్నారు. అందుకే నెత్తురు, నీరు కలిసి ప్రవహించడం ఇక సాధ్యం కాదని ప్రధాని మోడీ బలంగా విశ్వసిస్తున్నారు. 
 
ప్రపంచబ్యాంకు దౌత్యంతో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని (ఇండస్ ట్రీటి) పునఃసమీక్షించాలన్న యోచనలో ఉన్నారు. ఇదే కీలకాంశంగా ఆయన అధ్యక్షత అత్యంత కీలక సమావేశం జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్‌.జైశంకర్‌, కేంద్ర జలవనరుల కార్యదర్శి శశిశేఖర్‌ పాల్గొన్నారు. 
 
ఈ భేటీలో ప్రధాని పైవ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇండస్ ‌(సింధు), చీనాబ్‌, జీలం నదులు మన భూభాగం గుండా ప్రవహిస్తున్నా.. పై ఒప్పందం ప్రకారం పాక్‌కు 80 శాతం నీరు వాడుకుంటోంది. ఈ కారణంగా పాక్ భూభాగం సస్యశ్యామలంగా ఉంది. పైగా, ఈ నదుల నిర్వహణ బాధ్యత పాక్‌ చేతుల్లో ఉంది. 
 
అయితే, యురీ ఉగ్ర దాడి నేపథ్యంలో పాక్‌పై ఒత్తిడి పెంచేందుకు ఈ ఒప్పందాన్ని రద్దుచేయాలని అంతర్గతంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. అలాచేస్తే జలసంక్షోభం ఏర్పడి పాక్‌ కాళ్లబేరానికి వస్తుందన్న వాదనలు లేకపోలేదు. ఒప్పందం రద్దయితే జమ్మూకాశ్మీరును, పంజాబ్‌ను వరదలు ముంచెత్తుతాయన్న ఆందోళన కూడా ఉంది. అందుకే అన్ని అంశాలపై అత్యంత కీలక సమావేశం నిర్వహించి, ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి