కార్పొరేట్లకు అప్పగించడమే దేశభక్తా? సీఎం మమతా బెనర్జీ

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:41 IST)
దేశ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే దేశ భక్తా అంటూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. 
 
దేశభక్తి గురించి గొంతు చించుకునే బీజేపీ.. దేశంలోని వనరులన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని, ఇదెక్కడి దేశభక్తి అని ప్రశ్నించారు. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సహా రైల్వేను కూడా అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, పేదల్ని మోసం చేసేలా ఉందని ఆరోపించారు.
 
కరోనా సమయంలో వలస కార్మికులను ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం వద్ద లేని డబ్బులు పార్టీలోకి వలస వచ్చే అవినీతి నాయకులను ఢిల్లీ రప్పించేందుకు మాత్రం ఉన్నాయని ఆరోపించారు. బీజేపీలో చేరేందుకు నలుగురు టీఎంసీ నేతలు ఇటీవల ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లడాన్ని ఉద్దేశించి మమత ఈ వ్యాఖ్యలు చేశారు.
 
అయితే, ఈ వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు తప్పుబట్టారు. బడ్జెట్ ప్రకటనపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం సహజమని అన్నారు. బడ్జెట్‌లో ప్రస్తావన లేనంత మాత్రాన మొండిచేయి చూపినట్టు కాదని స్పష్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు