ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా.. 3 సీట్లకే బీజేపీ పరిమితం

శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (15:46 IST)
దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు తమ హవాను కొనసాగించాయి. భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్, యూపీలోని ఘోసీ, కేరళలోని పూత్తుపల్లి, త్రిపురలోని బాక్సానగర్, ధన్పూర్, వెస్ట్ బెంగాల్‌లోని ధూపురి, జార్ఖండ్‌లోని దుమ్రి అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగేశ్వర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి పార్వతిదాస్ విజయం సాధించారు. 
 
అలాగే, త్రిపురలోని రెండు అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. బాక్సానగర్ సీటును బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హోసైన్, ధన్పూర్ నుంచి కమలం పార్టీకే చెందిన బిందు దేవ్నాథ్ గెలిచారు. బాక్సానగర్‌లో 66 శాతం మంది మైనార్టీ ఓటర్లు ఉండగా బీజేపీకి 34,146 ఓట్లు, సీపీఎం అభ్యర్థికి 3,909 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి బీజేపీ 30వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. 
 
అలాగే ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ధన్పూర్‌లో కూడా బీజేపీ 18,871 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్, తిప్రమోతా పార్టీలు సీపీఎంకు మద్దతిచ్చాయి. కానీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ధూపురి నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ సమీప బీజేపీ అభ్యర్థి తపసి రాయ్‌పై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 
కేరళ రాష్ట్రంలోని పూత్తపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ 37,719 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సీపీఎం అభ్యర్థి జైక్ సీ థామస్ రెండో స్థానంలో నిలిచారు. దుమ్రి నియోజకవర్గం నుంచి జేఎంఎం అభ్యర్థి బేబీ దేవీ ముందంజలో ఉన్నారు. యూపీలో ఎస్పీ అభ్యర్థి సుధాకర్ సింగ్ సమీప అభ్యర్థి బీజేపీ దారాసింగ్ చౌహాన్పై 22 వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు