కావేరి జలాల వ్యవహారం: మనమంతా మనుషులం.. విధ్వంసం ఆపండి: ప్రకాష్ రాజ్

బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:09 IST)
తమిళనాడుకు కావేరి జలాలు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 5న కావేరి జలాలు విడుదలపై ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయాలని .. సుప్రీం కోర్టను ఆశ్రయించిన కర్ణాటక ఫైర్ అయ్యింది. ఇప్పటి వరకు నీళ్లు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించింది. ఈ నెల 20 వరకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందేనని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
 
కర్ణాటక-తమిళనాడు రాష్ట్రాల్లో కావేరీ జలాల వివాదం రోజురోజుకి తీవ్ర స్థాయికి చేరుతుంది. ఇప్పటికే నిరసనకారులు కర్ణాటకలో ఉన్న తమిళుల ఆస్తులను, తమిళనాడులో ఉన్న కన్నడిగుల ఆస్తులను నాశనం చేయడమే కాదు బస్సులను తగులబెడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు. దీనిపై సెలెబ్రిటీలు ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుకుండా సంయమనం కోసం పాటు పడుతున్నారు. ఈ లిస్టులో ప్రకాష్ రాజ్ కూడా చేరిపోయారు. 
 
దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్లో ద్వారా స్పందిస్తూ.. కర్ణాటక, తమిళనాడుల్లో జరుగుతున్నది చూస్తుంటే బాధగా ఉందన్నారు. మన హక్కుల కోసం మనం పోరాడాలి. న్యాయం సాధించాలే కానీ ఇలా బస్సుల్ని తగలబెట్టి.. ఆస్తుల్ని ధ్వంసం చేయకూడదన్నారు. దీంతో ఒరిగేదేమీ లేదని చెప్పుకొచ్చారు. 
 
అలాగే "మనకు కోర్టులున్నాయ్, నాయకులున్నారు, చట్టముంది. మనమంతా మనుషులం. శాంతిగా పోరాడుదాం. మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. శాంతిగా ఉండండి, విధ్వసం ఆపండి" అంటూ నిరసనకారులకు ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి