వలస కార్మికులపై ఉదాసీనత క్షమించరానిది : కేంద్రంపై సుప్రీం ఫైర్

బుధవారం, 30 జూన్ 2021 (12:22 IST)
దేశంలోని వలస కార్మికుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసంఘటిత రంగ, వలసకార్మికుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం క్షమించరానిదంటూ మండిపడింది. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత క్షమించరానిదని జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఎంఆర్‌.షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అసంఘటిత రంగ కార్మికులు, వలసకార్మికుల సమాచార నమోదు ప్రక్రియ ఎందుకు ఆలస్యమైందని, ఈ వ్యవహారంలో మీ వైఖరి క్షమార్హం కాదంటూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖపై మండిపడింది. వలస కార్మికుల ఆందోళనలను మీరు పట్టించుకోవడం లేదని, మీ వైఖరి ఆమోదయోగ్యం కాదని ధ్వజమెత్తింది. 
 
అసంఘటిత రంగం, వలసకార్మికులను నమోదు చేయడానికి వెంటనే ఒక పోర్టల్‌ను ప్రారంభించాలని, జులై 31వ తేదీ నాటికి ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. అవసరమైతే నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ సహకారాన్ని తీసుకోవాలని సూచించింది.
 
అలాగే ''వన్‌నేషన్‌ -వన్‌ రేషన్‌ పథకం'' అమలు కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా ఆహారధాన్యాలను అందించాల్సిందిగా కేంద్రానికి సూచించింది. ''వన్‌ నేషన్‌, వన్‌ రేషన్‌'' పథకానికి రేషన్‌ కార్టు దారులంతా అర్హులేనని, వారంతా జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) పరిధిలోకి వస్తారని తెలిపింది. 
 
వారు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్‌ పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు పేర్కొంది. వలసకార్మికులకు రేషన్‌ అందించేందుకు రాష్ట్రాలు వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని తెలిపింది. దీనికి జులై 31ని డెడ్‌లైన్‌గా పేర్కొంది. ఆ తేదీలోగా పథకం అమలు, అందుకు సంబంధించిన సమాచార సేకరణ జరగాలని కోర్టు ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు