కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు : రాష్ట్రాలకు కేంద్రం లేఖ

శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (20:12 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. ఈ వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంది. ఈ కారణంగా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మరోసారి కేసుల పెరిగిపోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య 11 వేలు దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 66 వేలకు చేరుకుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఎనిమిది రాష్ట్రాలకు లేఖ రాసింది. 
 
ఈ రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 63 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం దాటింది. 'కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు. వైరస్‌ కట్టడి విషయంలో అలసత్వం వహించకుండా.. అప్రమత్తంగా వ్యవహరించాలి' అని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 
 
కొవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. అధిక సంఖ్యలో కేసుల నమోదు స్థానికంగా వైరస్‌ వ్యాప్తిని సూచిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభదశలోనే దీన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
అన్ని జిల్లాల్లో కొవిడ్ వ్యాప్తిపై పర్యవేక్షణను పెంచాలని, ఇన్‌ఫ్లుయెంజా, శ్వాసకోస ఇన్ఫెక్షన్ల కేసులపైనా దృష్టి సారించాలని తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని, కోవిడ్ నిబంధనలు పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు