మరికొన్ని గంటల్లో జాబిల్లిని ముద్దాడనున్న 'విక్రమ్ ల్యాండర్'

మంగళవారం, 22 ఆగస్టు 2023 (09:24 IST)
జాబిల్లి దక్షిణ ధృవం అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగం భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఇందులో అమర్చిన విక్రమ్ ల్యాండర్‌ సాఫ్ట్‌ల్యాండింగ్‌కు మరికొన్ని గంటలే మిగిలివున్నాయి. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిని ముద్దాడనుంది. ఈ అద్భుత క్షణాలను ఇస్రో బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం యావత్ ప్రపంచం ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తుంది. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద సురక్షితంగా దిగి చరిత్ర సృష్టించేందుకు 'చంద్రయాన్-3' లోని విక్రమ్ ల్యాండర్ సన్నద్ధమవుతోంది. 
 
ఇప్పటికే భూమి నుంచి కనిపించని చందమామ ఆవలి వైపునకు సంబంధించిన ఫొటోలను తాజాగా అది పంపించింది. 2019లో చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా పంపించిన ఆర్బిటర్‌తో 'విక్రమ్' అనుసంధానమవడం తాజాగా చోటుచేసుకున్న మరో కీలక పరిణామం. జాబిల్లి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌తో చంద్రయాన్ -3 ల్యాండర్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించింది. 
 
'మిత్రమా.. స్వాగతం! అంటూ విక్రమ్‌కు పాత ఆర్బిటర్ స్వాగతం పలికింది. ఆ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ స్థాపితమైంది. ల్యాండర్ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్కింగ్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు తెరుచుకున్నట్లయింది' అని ట్వీట్ చేసింది. చంద్రయాన్-2 ఆర్బిటర్ మిషన్ జీవితకాలం ఏడేళ్లని 2019లో ఇస్రో తెలిపిన సంగతి గమనార్హం.
 
ఇదిలావుంటే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ దిగే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం బుధవారం 5:20 గంటల నుంచి ప్రారంభమవుతుందని ఇస్రో తెలిపింది. అన్నీ అనుకూలిస్తే అదేరోజు సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై ల్యాండర్ దిగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు