కస్టమర్ల కోసం చితక్కొట్టుక్కున్నారు.. ఎక్కడ?

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (13:09 IST)
కస్టమర్లను ఆహ్వానిచే విషయంలో చెలరేగిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఫలితంగా పొట్టకూటి కోసం వ్యాపారం చేసుకునే పానీపూరీ వ్యాపారులు చితక్కొట్టుకున్నారు. అదీకూడా నడి రోడ్డుపై పెద్ద పెద్ద దుడ్డుకర్రలు, ఇనుపరాడ్లతో కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌లో జరిగింది. 
 
సాధారణంగా ఇపుడు ప్రతి చోటా సాయంత్రం అయితే చాలు మనవాళ్లంతా పానీపూరి, చాట్ కోసం కష్టమర్లు తహతహలాడిపోతున్నారు. బండి ఎక్కడ కనబడితే అక్కడ యువతీయువకులు అక్కడ వాలిపోతున్నారు. అయితే పానీపూరి, చాట్‌ను అమ్మేది మాత్రం పొట్ట నింపుకునే సాధారణ వ్యాపారులే. అలాంటి వారు కస్టమర్ల కోసం కొట్లాడుకోవడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
 
పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని బడౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెయిన్ బజార్‌లో రెండు పానీపూరీ దుకాణాలు పక్కపక్కనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ వినియోగదారుడు అక్కడికి రావడంతో తన షాప్‌కు రావాలంటే, తన షాప్‌కు రావాలంటూ ఇద్దరూ అతడిని ఆహ్వానించారు. ఈ క్రమంలో రెండు దుకాణదారుల మధ్య గొడవ మొదలైంది.
 
క్షణాల్లోనే గొడవ ముదిరింది. లాఠీలు, కర్రలతో ఇరు వర్గాలకు చెందిన వారు రోడ్డెక్కారు. ఇష్టం వచ్చినట్టు బాదుకున్నారు. వీరి గొడవతో మార్కెట్ రణరంగాన్ని తలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. 
 
ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్ నేత ఒకరు ‘న్యాయ వ్యవస్థకు మంగళం పలికిన ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్’ అని కామెంట్ చేశారు. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు