కోబ్రా కమాండో రాకేశ్‌కు విముక్తి ... కరుణ చూపిన మావోయిస్టులు

గురువారం, 8 ఏప్రియల్ 2021 (19:20 IST)
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఆయనకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఆయనను మావోయిస్టులు సురక్షితంగా విడుదల చేశారు. రాకేశ్వర్‌సింగ్‌ విడుదలను ఛత్తీస్‌గఢ్‌ ఐజీ ధృవీకరించారు. 
 
ఇటీవల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - సుక్మా జిల్లాలో మావోయిస్టుల విధ్వంసం సృష్టించారు. మావోల దాడిలో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌ బందీగా చిక్కారు. ఈయన గత ఐదు రోజులుగా మావోల చెరలో ఉన్నాడు. 
 
ఈ క్రమంలో రాకేశ్వర్‌కు ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని సురక్షితంగా విడుదల చేయాలంటూ ఆయన భార్య, కుమార్తె మీడియా ముఖంగా మావోలను వేడుకున్నారు. ఈ క్రమంలో తెర్రం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు గురువారం వదిలేశారు. 
 
అయితే, రాకేశ్వర్‌సింగ్‌ విడుదల కోసం మావోలు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు కూడా పెట్టారు. అతడు క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని మావోయిస్టులు చెప్పారు. బుధవారం తమ చెరలో ఉన్న రాకేశ్వర్‌ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. 
 
మావోయిస్టులు తమ అధీనంలోకి తీసుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌సింగ్‌‌ను వెంటనే విడుదల చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల దిశగా ముందడుగు వేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌, కో కన్వీనర్లు ప్రొఫెసర్‌ జి.లక్ష్మణ్‌, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్‌ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు