కేంద్రానికి ఆరు నెలల రూల్‌తో చిక్కు : లేవనెత్తిన జస్టిస్ ఎన్వీ రమణ

మంగళవారం, 25 మే 2021 (12:59 IST)
కేంద్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చిపడింది. సీబీఐ డైరెక్టర్ పదవికి ఎంపిక చేసేవారి పదవీకాలం ఆర్నెల్లలోపు ఉండరాదన్నది ఈ ఆరు నెలల రూల్.ఈ విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ లేవనెత్తారు. దీంతో కేంద్రం చిక్కుల్లోపడింది. 
 
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదుపరి చీఫ్‌ను నియమించేందుకు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి కమిటీ భేటీ అయింది. ఈ కమిటీలో ప్రధానితో పాటు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి (కాంగ్రెస్) సభ్యులుగా ఉన్నారు. 
 
ఈ సమావేశంలో జరిగిన చర్చలపై ఎన్డీటీవీ ఓ కథనాన్ని ప్రచురించింది. సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఒక కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చినట్లు సమాచారం. అదే 'ఆరు నెలల రూల్. ఈ భేటీలో సీజేఐ ఈ రూల్‌ను ప్రస్తావించారు. ఈ నిబంధన ప్రకారం, ఆరు నెలల లోపు సర్వీసు మిగిలి వున్న వారు పోలీస్ చీఫ్ పదవులకు అనర్హులని సీజేఐ రమణ తెలిపారు. 
 
ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే ఈ మేరకు తీర్పును వెలువరించిందని గుర్తుచేశారు. ఆ నిబంధనను ఇప్పుడు కూడా సెలెక్షన్ ప్యానెల్ ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. సీజేఐ లేవనెత్తిన ఈ పాయింట్‌కు అధిర్ రంజన్ చౌధురి మద్దతు పలికారు.
 
ఈ భేటీపై అధిర్ రంజన్ చౌధురి మాట్లాడుతూ, సీబీఐ చీఫ్ పదవికి పేర్లను ఎంపిక చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అలసత్వాన్ని ప్రదర్శించిందని అన్నారు. ప్యానల్ మీటింగ్ ముందు రోజే 109 పేర్లలో 16 మందిని తొలగించడం దీనికి నిదర్శనమని చెప్పారు. నిబంధనలను దృష్టిలో పెట్టుకోకుండా అధికారుల పేర్లను షార్ట్ లిస్ట్ చేశారని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు