ఇండియా కూటమి మరింతగా బలోపేతం.. కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లు ఖాయం : చిదంబరం

వరుణ్

ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (10:41 IST)
గత లోక్ సభ ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక సీట్లను గెలుచుకుంటుందని, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం జోస్యం చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయని... 2019 కంటే ఇప్పుడు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాదిన మంచి సీట్లు గెలుచుకుంటామన్నారు. 
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. దేశంలో హిందూమతానికి, హిందువులకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కానీ బీజేపీ మాత్రం నరేంద్ర మోడీని హిందూ రక్షకుడిగా, ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అత్యంత కీలకమన్నారు. ఆమె నేతృత్వంలో బెంగాల్లో ఇండియా కూటమి బలోపేతమవుతుందన్నారు. 
 
తాను అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడటం లేదని అన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఇండియా కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందన్నారు. కేరళలో 20 సీట్లు కైవసం చేసుకుంటామన్నారు. బీజేపీకి ఒక్క సీటూ రాదన్నారు. హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఢిల్లీలలో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
విపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయని, అవి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నాయని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ప్రధాని మోదీ, బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చాదీవి వివాదం ఇప్పటిదికాదని, 50 ఏళ్ల క్రితం కుదిరిన ఒప్పందమన్నారు. 2014 నుంచి మోడీ ప్రధానిగా ఉన్నారని... కానీ ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు లేవనెత్తారని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు