ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి లేదు : మల్లికార్జున ఖర్గే

మంగళవారం, 18 జులై 2023 (14:06 IST)
తనకు ప్రధానమంత్రి పదవిపై ఏమాత్రం ఆసక్తి లేదా ఆశ లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమన్నారు. 
 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించటమే లక్ష్యంగా బెంగళూరులో రెండోరోజు జరుగుతోన్న విపక్షాల సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. 'తాము అధికారంలోకి రావడం ఈ సమావేశం ఉద్దేశం కాదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికతత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయం. రాష్ట్ర స్థాయిలో తమలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమే. కానీ, అవి సిద్ధాంతరపరమైనవి కావని గుర్తించాలి. ఇవేవీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు పెద్ద విషయాలు కావు' అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
 
తాము 26 పార్టీలకు చెందిన వారమన్న ఖర్గే.. 11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. భాజపా సొంతగా 303 సీట్లు సాధించలేదని ఆయన జోస్యం చెప్పారు. ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని భాజపా వదిలేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం భాజపా అధ్యక్షుడితోపాటు ఆయా రాష్ట్రాల కాషాయ నేతలు పాత మిత్రుల కోసం వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు