భార్య కోసం ఆర్థిక నేరగాడు సుఖేష్ జైలులో దీక్ష.. ఎందుకో తెలుసా?

ఆదివారం, 12 జూన్ 2022 (11:51 IST)
కరుడుగట్టిన ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ తీహార్ జైలులో దీక్షకు దిగారు. ఇదే జైలులో ఉన్న తన భార్యను వారం వారం కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన ఈ దీక్ష చేపట్టారు. 
 
అవినీతి కేసులో చిక్కుకున్న రాన్​బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్​, శివిందర్​ సింగ్​కు బెయిల్​ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేసిన కేసులో సుఖేశ్‌, ఆయన భార్య గత నాలుగు నెలలుగా తిహార్ జైలుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 
 
అయితే, వీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో తన భార్యను వారం వారం కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దీక్షకు దిగాడు. గతంలో కొద్దిరోజులపాటు భోజనం మానేసిన సుఖేశ్.. మే 23వ తేదీ నుంచి మళ్లీ నిరాహార దీక్ష ప్రారంభించాడు. దీంతో అధికారులు అతడికి గ్లూకోజ్‌లు అందిస్తున్నారు.
 
దీనిపై తిహార్ జైలు డైరెక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ మాట్లాడుతూ.. అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న చంద్రశేఖర్ మొదట ఏప్రిల్ 23 నుండి మే 2 వరకు, మళ్లీ మే 4 నుండి మే 12 వరకు ఆహారం తీసుకోలేదని తెలిపారు. ఆ సమయంలో అతడికి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్‌లు అందించామన్నారు. 
 
మే 12 నుండి మే 22 వరకు సుఖేశ్‌ లిక్విడ్ డైట్ తీసుకోవడం ప్రారంభించాడని.. కానీ మే 23 నుండి  మళ్లీ ఎలాంటి ఆహారం తీసుకోవడంలేదని పేర్కొన్నారు. దీంతో జైలు ఆసుపత్రిలోనే ప్రస్తుతం అతడికి గ్లూకోజ్‌లు అందిస్తున్నట్లు తెలిపారు.
 
ప్రస్తుతం అదే జైలులో అతడి భార్య లీనా ఖైదీగా ఉంది. సుఖేశ్‌ అభ్యర్థన మేరకు నెలలో రెండు సార్లు (ప్రతి నెలా మొదటి, మూడో శనివారం) భార్యను కలిసేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఎక్కువసార్లు ములాఖత్‌కు అనుమతించాలని సుఖేశ్‌ డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు