ముంబైలో 144 సెక్షన్.. తమిళనాడులో 3,882 మందికి కోవిడ్

బుధవారం, 1 జులై 2020 (18:48 IST)
దేశవ్యాప్తంగా అన్‌లాక్ రెండో దశ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై సిటీలో 144 సెక్షన్‌ను పోలీసులు విధించారు. నగరంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపధ్యంలో ముంబై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఒకరు, లేదా అంతకంటే ఎక్కువ మంది కనిపిస్తే వారి కదలికపై నిఘా ఉంటుందని పోలీసు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
నిత్యావసర వస్తువులు, మెడికల్ ఎమర్జెన్సీ సరఫరాలు మినహా కంటైన్‌మెంట్ జోన్లలో వ్యక్తుల కదలికలపై నిషేధం విధిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాగా, రాత్రి వేళల్లో కర్ఫ్యూని కూడా పటిష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ వేళలను కేంద్రం ప్రకటించగా, ముంబైలో మాత్రం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. 
 
ఎమర్జెన్సీ సర్వీసులు, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారులు, ఆహారం, కూరగాయలు, పాలు, మెడికల్ ఎమర్జెన్సీలు, మీడియా, పోర్టులు, హోమ్ డెలివరీ తదితరాలను మాత్రం నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయించారు.
 
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న చెన్నైతో పాటు మరో మూడు జిల్లాలో మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటికీ వైరస్‌ విజృంభిస్తున్నది. ప్రతీరోజూ రాష్ట్రంలో దాదాపు 4వేల కేసులు నమోదవుతున్నాయి.
 
బుధవారం కొత్తగా 3,882 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో 63 మంది చనిపోగా 2,852 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 94,049కు చేరింది. ప్రస్తుతం 39,856 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 52,926 మంది కొలుకొని డిశ్చార్జ్‌ కాగా, కరోనా బారినపడి 1,264 మంది మరణించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు