అనుమానిస్తున్నాడని అడ్డంగా నరికేసింది..

బుధవారం, 27 మార్చి 2019 (12:35 IST)
క్రైమ్‌ షోలకు అలవాటు పడ్డ ఓ భార్య తనను అనుమానిస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలలోకి వెళ్తే... రాజేష్, సునీత భార్యాభర్తలు. వీరి మధ్య తరచూ తగాదాలు జరుగుతూండేవి. దీనికితోడు సునీతకు ఎవరితోనో సంబంధం ఉందంటూ అనుమానించడంతో ఆవిడ అతనిపై మరింత కోపాన్ని పెంచుకొని... ఎలాగైనా ఈ గొడవలకు స్వస్తి చెప్పాలని భావించింది. దీని కోసం తన భర్తను చంపడానికే సిద్ధపడింది సునీత. 
 
ముందుగానే అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 14వ తేదీన రాజేష్‌కు మత్తుమందు ఇచ్చి, తన కుమారుడిని పక్కింటికి పంపించింది.  రాజేష్ శరీరాన్ని కసితీరా 8 భాగాలుగా నరికి... ఎవరికీ ఏమాత్రం అనుమానం రానీయకుండా ముక్కలను వేర్వేరు బ్యాగుల్లో ప్యాక్‌ చేసి... తలను డ్రైనేజీలోనూ... కాళ్లను ఇంటి ఆవరణలోనూ, మిగతా భాగాలను తన బెడ్‌రూమ్‌తో పాటు, మిగిలిన ప్రాంతాల్లోనూ పూడ్చిపెట్టేసింది.
 
తర్వాత 2 రోజులకు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత కొన్ని రోజులకు సునీత ఇంటి దగ్గరలోని డ్రైనేజీలో గుర్తుపట్టని స్థితిలో ఒక మనిషి తల కన్పించింది. కానీ పోలీసులు దానిని రాజేష్ తలగా నిర్ధారించుకోలేకపోయారు. 
 
అయితే గతవారం సునీత గదిలో పూడ్చిన నేలపై కుళ్లిపోయే స్థితిలో ఉన్న వేళ్లను సదరు ఇంటి యజమాని గమనించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో సునీతను విచారించగా హత్య చేసినట్టుగా అంగీకరించింది. ప్రేమికుల దినోత్సవం నాడే భర్తను పరలోకానికి పంపిన సునీత ప్రస్తుతం తీహార్‌ జైల్‌లో శిక్ష అనుభవిస్తోంది. కాగా... తల్లి, తండ్రికి దూరమైన బాలుడు పిల్లల  ఆశ్రమంలో చేర్చబడ్డాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు