ఏడేళ్ళ చిన్నారిపై కాటికాపరి అత్యాచారం.. న్యాయం కోసం దళిత ఫ్యామిలీ పోరాటం

బుధవారం, 4 ఆగస్టు 2021 (12:33 IST)
ఢిల్లీలో ఏడేళ్ళ దళిత చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత ఆ చిన్నారిని చంపేశాడు. ఈ దారుణానికి పాల్పడింది కూడా ఓ శ్మశానంలో కాటికాపరిగా పని చేసే కామాంధుడు. ఈ చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పరామర్శించారు. ఈ ఘటనలో న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 
 
ఢిల్లీలోని పాత నంగల్‌ గ్రామంలోని ఓ శ్మశానంలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన ఓ బాలికను తల్లిదండ్రుల అనుమతి లేకుండా హడావుడిగా దహనం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తమ బిడ్డపై కాటికాపారి అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీనిపై తమకు న్యాయం చేయాలంటూ చిన్నారి కుటుంబసభ్యులు నిరసన చేపట్టారు. 
 
ఈ క్రమంలో బుధవారం ఉదయం రాహుల్‌ గాంధీ చిన్నారి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. 'ఆ కుటుంబంతో నేను మాట్లాడాను. వారు కోరుకునేది ఒక్కటే. తమ బిడ్డకు న్యాయం జరగాలని ఆరాటపడుతున్నారు. వారికి మేం అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకూ వారి తరఫున పోరాడతాం' అని రాహుల్ హామీ ఇచ్చారు. 
 
మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా చిన్నారి కుటుంబాన్ని కలవనున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని పాత నంగల్‌ గ్రామానికి చెందిన బాధితురాలి కుటుంబం శ్మశానానికి ఎదురుగా ఉన్న ఇంట్లో నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం సమయంలో అక్కడ ఉన్న వాటర్‌కూలర్‌ నుంచి నీళ్లు తెస్తానని తల్లికి చెప్పి వెళ్లిన బాలిక ఎంతకీ తిరిగిరాలేదు. 
 
అరగంట తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌ ఆమె తల్లి వద్దకు వచ్చి బాలిక మరణించినట్లు చెప్పాడు. వాటర్‌ కూలర్‌ నుంచి నీళ్లు పడుతున్న సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలిందని చెప్పాడు. పోలీసులకు ఈ విషయం తెలిస్తే పోస్ట్‌మార్టం పేరుతో ఇబ్బంది పెడతారని, అవయవాలు దొంగతనం చేస్తారని చెప్పి హడావుడిగా బాలిక మృతదేహాన్ని దహనం చేయించాడు. 
 
అయితే రాధేశ్యామ్‌ తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫోన్‌ చేశారు. తమ బిడ్డపై కాటికాపరి సహా మరికొందరు అత్యాచారం చేసి చంపేశారని ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ తమ ఇంటివద్దే న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు