మారన్ ఫ్యామిలీలో మంటలు... రచ్చకెక్కిన కుటుంబ కలహాలు..

ఠాగూర్

శుక్రవారం, 20 జూన్ 2025 (11:00 IST)
తమిళనాడు రాష్ట్రంలో మీడియా రంగాన్ని శాసిస్తున్న మారన్ ఫ్యామిలీలో ఇపుడు మంటలు చెలరేగాయి. ఈ కుటుంబ కలహాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసొలి మారన్‌కు ఇద్దరు కుమారులు. ఒకరు కళానిధి మారన్. రెండో కుమారుడు దయానిధి మారన్. కళానిధి మారన్ సన్ టీవీతో పాటు ఇతర వ్యాపార కార్యక్రమాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. 
 
దయానిధి మారన్. కేంద్ర మాజీ మంత్రి. ఇపుడు డీఎంకే సెంట్రల్ చెన్నై ఎంపీ. ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో విభేదాలు తలెత్తాయి. దీంతో కళానిధి మారన్‌తో పాటు ఆయన భార్య కావేరీ మారన్, మరో ఆరుగురుకు దయానిధి మారన్ లీగల్ నోటీలు పంపిచారు. కళానిధి మారన్ మనీలాండరింగ్‌తో పాటు పలు మోసపూరిత ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడ్డారని దయానిధి మారన్ ఆ నోటీసుల్లో సంచలన ఆరోపణలు చేశారు.
 
ఈ మేరకు దయానిధి మారన్ తరపున న్యాయవాది సురేశ్ ఈ నెల 10వ తేదీన నోటీసులు జారీచేసినట్టు సమాచారం. కంపెనీలో వాటాల పంపకాన్ని 2003 నాటి స్థితికి తీసుకుని రావాలని దయానిధి మారన డిమాండ్ చేసినట్టు సమాచారం. కళానిధి మారన్ పాల్పడినట్టు ఆరోపిస్తున్న తీవ్రమైన ఆర్థిక నేరాలపై చర్యలు తీసుకోవాలని తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయాన్ని కూడా దయానిధి మారన్ కోరుతున్నట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
అయితే, ఈ వివాదం పూర్తిగా వ్యక్తిగతమని, దీని ప్రభావం సన్ టీవీ గ్రూప్ కార్యకలాపాలపై ఏమాత్రం ప్రభావం చూపబోదని విశ్వనీయ వర్గాలు ఒక వార్తా సంస్థకు తెలిపినట్టు సమాచారం. ఈ పరిణామం తమిళనాట రాజకీయ వ్యాపార రంగాల్లో చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు