అరుణ్ జైట్లీ ఆదాయమెంత? పన్ను వివరాలేంటి : కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (15:27 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ చేశారు. అరుణ్ జైట్లీకి సంబంధించిన ఆదాయం, పన్ను వివరాలను బహిర్గతం చేయాలంటూ కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరుణ్ జైట్లీ బ్యాంకు వివరాలతో పాటు ఆయన భార్య కూతురు, అల్లుడికి సంబంధించిన 1998 నుంచి 2014 వరకు బ్యాంకు వివరాలన్నింటిని ఇవ్వాలని ఆయన కోరాడు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధినేతగా జైట్లీ 13 యేళ్ళ పాటు ఉన్నారనీ, ఆ సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ ప్రధాన ఆరోపణ. 
 
ఈ ఆరోపణలతో తనకు పరువునష్టం వాటిల్లిందని కేజ్రీవాల్‌పై జైట్లీ పరువునష్టం దావా వేశారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలపై కూడా అరుణ్ జైట్లీ ఈ మేరకు పరువు నష్టం దావా వేశారు. అయితే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలను స్వీకరించే సమయంలో తాను ఎలాంటి వ్యక్తిగత ఆర్థిక లబ్దికి పాల్పడలేదని జైట్లీ నిరూపించుకోవాలంటే ఈ డాక్యుమెంట్లు అవసరమని కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించారు. దీంతో ఈ కేసు ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 6, 7 తేదీల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగనుంది.  

వెబ్దునియా పై చదవండి