చైనా యాప్స్‌పై నిషేధం వెనుక కారణమిదే...?

మంగళవారం, 30 జూన్ 2020 (08:55 IST)
భారతదేశ సార్వభౌమత్వానికి, గోప్యతకు విఘాతంగా మారాయన్న కారణంతో టిక్ టాక్, షేరిట్‌తో పాటు.. మొత్తం 59 రకాల చైనా యాప్స్‌పై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో అనేక మంది సెలెబ్రిటీల ఖాతాలు మూగబోయాయి. నిజానికి చైనా యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించడానికి బలమైన కారణం లేకపోలేదు. ముఖ్యంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగ్రహం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. 
 
యాప్స్‌పై నిషేధం అమలు చేయడం వెనుక ఉన్న అసలు కారణాన్ని పరిశీలిస్తే, ఇటీవలి లాక్డౌన్ సమయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సైన్యాధికారులతో జూమ్ యాప్ ద్వారా ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఓ చిత్రాన్ని ఆయన అధికారులకు యాప్ ద్వారా షేర్ చేశారు. 
 
రెండు రోజుల తర్వాత ఆ ఫోటో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. తాను సైనిక అధికారులకు షేర్ చేసిన యాప్ సోషల్ మీడియాలో కనిపించడంపై రాజ్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. దీంతోనే ప్రభుత్వ ఉద్యోగులు జూమ్ యాప్ వాడరాదని గత నెలలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇదే సమయంలో చైనా యాప్స్‌పై సెక్యూరిటీ ఆడిట్ చేయించగా, స్పై వేర్, మాల్ వేర్ ఉన్నట్టు తేలింది. ఇదేసమయంలో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దురాగతాలకు దిగింది.
 
చైనాకు చెందిన యాప్స్‌పై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదులు వెల్లువెత్తడం, ఈ యాప్స్ సమాచారాన్ని తస్కరిస్తున్నాయని రిపోర్టులు వెలువడ్డాయి. ఈ కారణాలతో పాటు ప్రజల్లో చైనాపై నెలకొన్న ఆగ్రహాన్ని కాస్తంతైనా చల్లార్చేందుకు చైనా యాప్స్ ను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు