ఢిల్లీలో హెరాయిన్ పట్టివేత-350 కేజీల నిషిద్ధ హెరాయిన్‌ స్వాధీనం

శనివారం, 10 జులై 2021 (20:13 IST)
Heroin
ఢిల్లీ పోలీసు శాఖలోని ప్రత్యేక విభాగం శనివారం 350 కేజీల నిషిద్ధ హెరాయిన్‌ని స్వాధీనం చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ 2,500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామని, వీరిలో ముగ్గురు హర్యానాకు ఒకరు ఢిల్లీకి చెందినవారని వారు చెప్పారు. 
 
ఇంత భారీ ఎత్తున డ్రగ్‌ని స్వాధీనం చేసుకోవడం ద్వారా ఓ ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్ గుట్టును రట్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద డ్రగ్ రవాణాను పట్టుకోవడం ఇదే మొదటిసారన్నారు. ప్రస్తుతం నార్కో-టెర్రరిజం కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 
 
కొన్ని నెలలుగా ఈ డ్రగ్ దందా సాగుతోందని, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఈ హెరాయిన్ మొదట ముంబైకి, ఆ తరువాత సముద్ర మార్గం ద్వారా సీక్రెట్ కంటెయినర్లలో ఢిల్లీకి చేరిందని స్పెషల్ సెల్ చీఫ్ నీరజ్ ఠాకూర్ తెలిపారు. గతనెలలో కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 22 లక్షల నిషిద్ధ సైకోట్రోపిక్ టాబ్లెట్స్ ను, 245 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు