ఐసిస్‌లో చేరేందుకు వెళుతున్న ఐఐటీ-గౌహతి విద్యార్థి అరెస్టు

వరుణ్

ఆదివారం, 24 మార్చి 2024 (11:52 IST)
ఐసిస్‌లో చేరేందుకు వెళుతున్న ఐఐటీ-గౌహతి విద్యార్థిని అరెస్టు చేశారు. ఈమెయిల్ ఆధారంగా గుర్తించిన అస్సోం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఆ విద్యార్థిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఈ విద్యార్థిని అస్సోం రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలోని హజో పట్టణానికి సమీపంలో శనివారం రాత్రి అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ విషయాన్ని అసోం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఐఐటీ గౌహతి విద్యార్థి ఐసిస్ పట్ల విధేయత చూపిస్తున్నట్టుగా చెబుతున్నాడని, అతడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. అరెస్టయిన విద్యార్థిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ(ఎన్డీఎఫ్) కల్యాణ్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన ఒక ఈ-మెయిల్లోని సందేశాన్ని నిర్ధారించామని చెప్పారు. ఈ-మెయిల్లోని సందేశాన్ని ధ్రువీకరించిన అనంతరం దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. ఈ-మెయిల్‌ను విద్యార్థి పంపించాడని, ఐసిస్ చేరడానికి వెళ్తున్నట్టుగా అందులో పేర్కొన్నాడని వివరించారు. విద్యార్థి అరెస్టు విషయాన్ని ఐఐటీ గౌహతి అధికారులకు తక్షణమే తెలియజేశామని వివరించారు. 
 
విద్యార్థి తప్పిపోయాడని, అతడి ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని యూనివర్సిటీ అధికారులు తెలిపారని చెప్పారు. ఇక అరెస్టయిన విద్యార్థి ఢిల్లీలోని ఓఖా ప్రాంతానికి చెందినవాడని, గౌహతి యూనివర్సిటీలో 4వ సంవత్సరం విద్యార్థి అని కల్యాణ్ కుమార్ పాఠక్ వివరించారు. విద్యార్థి ఐసిస్‌లో చేరబోతున్నాడని నిర్ధారణ అయిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని, స్థానికుల సహాయంతో గౌహతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హజో ప్రాంతంలో విద్యార్థిని గుర్తించినట్టు అసోం పోలీసులు వివరించారు.
 
ప్రాథమిక దర్యాప్తు అనంతరం అతడిని ఎన్డీఎఫ్ కార్యాలయానికి తీసుకెళ్లామని, ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించామని అన్నారు. ఇక యూనివర్సిటీలోని విద్యార్థి రూమ్ లో ఐసిస్ జెండాతో పోలిన నల్ల జెండాను గుర్తించామని, ఈ జెండాను నిర్ధారించేందుకు నిషేధిత దుస్తులను ధ్రువీకరించే ప్రత్యేక సంస్థలకు పంపించామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు