ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కన్నవారి ఆశలను అడియాశలు చేసింది. తాను ప్రేమించిన ప్రియుడుతో కలిసి లేచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. తమ పరువు పోయిందని, తమ ముఖాలను ఇరుగు పొరుగువారికి చూపించలేక, అవమానభారాన్ని దిగమింగలేక కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో చోటుచేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూర్కు చెందిన మహదేవస్వామి, మంజుల దంపతులకు అర్పిత, హర్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. అయితే, వారి పెద్ద కుమార్తె అర్పిత ఓ యువకుడుని ప్రేమించింది. ఈ విషయంలో ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెను మందలించారు. పెద్దల మాటలను లెక్కచేయని అర్పిత తాను ప్రేమించిన యువకుడుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.
ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె, చెప్పాపెట్టకుండా ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. తీవ్ర మనస్తాపానికి గురైన మహదేవస్వామి, మంజుల దంపతులు తమ చిన్న కుమార్తెతో హర్షితతో కలిసి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.