ఢిల్లీలో మారిన వాతావరణం... నెలలో మూడుసార్లు భూప్రకంపనలు

ఆదివారం, 10 మే 2020 (15:16 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గత నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. ఆదివారం కూడా భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. ఈ భూప్రకంపనలు ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించాయి. 
 
ఢిల్లీలో గత నెల 12, 13 తేదీల్లో భూకంపం వచ్చింది. నెల వ్యవధిలోనే ఢిల్లీలో వరుస ప్రకంపనలు రావడం ఆందోళన కలిగించే పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీలో ఆదివారం వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. దుమ్ము, ధూళితో పాటు భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. 
 
దీంతో పగటిపూటే చీకట్లు అలుముకోవడంతో ఢిల్లీ వాసులు మధ్యాహ్నం సమయంలోనూ వాహనాల లైట్లు ఆన్ చేసుకుని తిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. తర్వాత వర్షం కూడా పడింది. 
 
ఢిల్లీలో ఉష్ణోగ్రత తగ్గిపోవడమే కాకుండా, కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఢిల్లీలో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు