ఆ నలుగురే కాదు అంబులెన్సూ కరువైంది... సైకిల్‌పై కరోనా రోగి మృతదేహం తరలింపు (Video)

మంగళవారం, 18 ఆగస్టు 2020 (12:10 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మానవ సంబంధాలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న రోగుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడం గగనంగా మారింది. ఆస్పత్రిలో చనిపోయిన కరోనా రోగి మృతదేహాన్ని శ్మశానానికి తరలించేందుకు కూడా సరైన వాహన సదుపాయం కూడా కరువైపోతోంది. దీంతో రోగి బంధువులు మనసు చంపుకోలేక అష్టకష్టాలుపడుతూ మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలో ఓ కరోనా రోగి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు సైకిల్‌పై శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హృదయ విదారక సంఘటన వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా కిట్టూరు తాలూకా ఎంకే హుబ్బళి అనే గ్రామానికి చెందిన 70 యేళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడటంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అయితే, ఆ రోగి సోమవారం ఉదయం చనిపోయారు. దీంతో మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా వాహనం సమకూర్చాలని మృతుని బంధువులు ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు. 
 
కానీ, ఆస్పత్రి సిబ్బంది వారి మొర ఆలపించలేదు. పైగా జోరువర్షం. ఏం చేయాలో దిక్కుతోచని ఆ కుటుంబ సభ్యులు రోగి మృతదేహాన్ని ఓ ప్లాస్టింగ్ బ్యాగులో చుట్టి, సైకిల్‌ పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వీడియోను కర్నాటక రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.శివకుమార్ తన ట్విట్టర్ ఖాతాలో కర్నాటక సీఎం యడ్యూరప్పను ట్యాగ్ చేసి షేర్ చేస్తూ, మీ ప్రభుత్వం ఏమైంది? ఒక అంబులెన్స్‌ను కూడా సమకూర్చలేరా? కరోనా వైరస్ మహమ్మారి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు