రైతు సంఘాల నేతలను మరోమారు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం..

ఠాగూర్

బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (15:30 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఛలో ఢిల్లీ పేరుతో హస్తిన సరిహద్దులకు తరలివచ్చిన రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు కేంద్ర మొగ్గుచూపింది. దీంతో రైతు సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి అర్జున్ ముండా తెలిపారు. మరోవైపు, బుధవారం కూడా పంజాబ్‌ నుంచి హర్యానాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన రైతులై పోలీసులు టియర్‌ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి' అని మంత్రి తెలిపారు. 
 
ఇదిలావుంటే, ఛలో ఢిలో కార్యక్రమంలో పాల్గొనే రైతులపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారని రైతు సంఘం నాయకుడు సర్వణ్‌ సింగ్ పంథేర్‌ తెలిపారు. కేంద్రంతో ఘర్షణ పడేందకు తాము రాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద మనసుతో కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంగళవారం ఆందోళనలో భాగంగా గాయపడిన రైతులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందన్న ఆయన, రైతులపై దాడిని ఖండించారు. వారికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. 
 
ఇదిలావుంటే, డాక్టర్ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులపై 2010లో భాజపా సభ్యుడు ప్రకాశ్‌ జావడేకర్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేవీ థామస్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. దానికి సంబంధించిన కాపీ తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో పంటకు కనీస మద్దతు ధర ఉత్పత్తి వ్యయం కంటే 50 శాతం ఎక్కువ ఉండాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిపారు. అయితే, దాన్ని మన్మోహన్‌ సింగ్ ప్రభుత్వం అంగీకరించలేదని వెల్లడించారు. ఎమ్‌ఎస్‌పీ, ఉత్పత్తి వ్యయం అనుసంధానం మిగిలిన వాటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందుకే ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు