ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం.. ఎవర్నీ వదిలిపెట్టొద్దు.. కరోనా టెస్టులు చేయండి..

గురువారం, 9 జులై 2020 (15:08 IST)
కరోనాను నియంత్రించే క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా టెస్టులు నిర్వహించి చికిత్స అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కోవిడ్ రెస్పాన్స్ స్కీమ్ కింద రోజువారీ కూలీలు, గృహ సహాయకులు, ఆటో డ్రైవర్లు, కూరగాయల వ్యాపారులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 
 
ప్రతి ఒక్కిరికి కరోనా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా వైద్య సదుపాయాలు సమకూరేలా ఢిల్లీ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. 
 
ఇందుకోసం నిషేధిత ప్రాంతాలు, బఫర్ జోన్లు, ఇతర ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. రిక్షా కార్మికులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగి, ఆటో, టాక్సీ డ్రైవర్లు, పార్శిల్ పంపిణీదారులు మొదలైన వారిని ఈ జాబితాలో చేర్చారు. 
 
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్‌డబ్ల్యుఎ, పోలీసు, ఇతర విభాగాల సహాయంతో అర్హులైనవారిని గుర్తించి ఓ నివేదిక తయారు చేయనున్నారు. 
 
అదేవిధంగా అన్ని జిల్లాలలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ తదితర ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి జాబితా సిద్ధం చేయాలని అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు