అసోంలో దారుణం.. ట్రక్కుకు నిప్పులు.. ఐదుగురు సజీవదహనం

శుక్రవారం, 27 ఆగస్టు 2021 (13:29 IST)
అసోంలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో ఐదుగురు కాలి చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ) హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని జిల్లా ఎస్పీ జయంత్‌ సింగ్‌ తెలిపారు.
 
గురువారం రాత్రి రేంజర్​బిల్​ ప్రాంతంలో ఆగంతుకులు తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపారు. అనంతరం వాటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చనిపోయిన ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు ఉన్నట్లు గుర్తించారు. ట్రక్కులలో మొత్తం 10 మంది ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
 
కొండ ప్రాంతాల్లో ఉన్న దిమా హసానో జిల్లా కొన్నేళ్ల క్రితం తీవ్రవాద కార్యకలాపాలకు నెలవుగా ఉన్నది. అయితే గత ఐదేండ్లుగా ఇక్కడ ఎలాంటి ఉగ్రవాద చర్యలు జరగలేదు. 
 
కాగా, కర్బీ అన్‌గ్లాంగ్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీఎన్‌ఎల్‌ఏ ఉగ్రవాదులను భద్రతా బలగాలు తుదముట్టించాయి. దీనికి ప్రతీకారంగానే వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు