2 కోట్ల మంది ఉద్యోగాలు ఊడిపోయాయ్- రాహుల్.. సీఎంఐఈ రిపోర్ట్ కూడా..?

బుధవారం, 19 ఆగస్టు 2020 (19:00 IST)
దేశంలో కరోనా విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా గడిచిన నాలుగు నెలల కాలంలో రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఊడిపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగతను, ఆర్థిక వ్యవస్థ విధ్వంసాన్ని ఎంతో కాలం దేశ ప్రజలకు తెలియకుండా దాచలేరన్నారు.

ఇప్పటి వరకు ఉద్యోగాలు కోల్పోయిన రెండు కోట్ల మందికి చెందిన కుటుంబాలు తీవ్ర సమస్యల్లోకి జారుకున్నాయని తెలిపారు. ఈ సమస్యను తప్పుడు వార్తా కథనాలతో, ఫేస్‌బుక్‌లో విద్వేష పోస్టులతో మరుగుపర్చలేరని రాహుల్‌ పరోక్షంగా మోదీ సర్కార్‌ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.
 
మరోవైపు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు పోయాయి. కోట్లాదిమందిపై ప్రభావం పడింది. జూలై నెలలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలైలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. ఉద్యోగాల కోత రోజురోజుకు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
 
సీఎంఐఈ డేటా ప్రకారం ఏప్రిల్ 2020లో 17.7 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మే నెలలో మరో 0.1 మిలియన్ల మంది ఉద్యోగం కోల్పోయారు. అదే సమయంలో జూన్ నెలలో మాత్రం 3.9 మంది కొత్తగా ఉద్యోగంలో చేరారు. మళ్లీ జూలై నెలలో 5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 
 
లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి జూలై నాటికి వేతన ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 18.9 మిలియన్లకు పెరిగింది. రికవరీ ఆరోగ్యకరంగా లేదని, ఉద్యోగాలు ఉన్నవారి పరిస్థితి కూడా ఒత్తిడి, వేతనాల కోత వంటి వివిధ కారణాలతో ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు