ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్తూ తిరిగిరాని లోకాలకు ఇంజనీరింగ్ విద్యార్థులు

సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:14 IST)
ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం కారులో బయలుదేరిన ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు రోడ్డు పక్కన ఆగివున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా టిప్పర్ కింద చిక్కుకునిపోయింది. దీంతో కారులోని ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం తమిళనాడు రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన పెరుంగళత్తూరులో జరిగింది. 
 
చెన్నై ఈసీఆర్ రోడ్డులో వున్న హిందూస్థాన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు అయిన వీరందరూ కలిసి సోమవారం చెన్నైలో జరగనున్న ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం శనివారం రాత్రి కారులో బయలుదేరారు. అర్థరాత్రిదాటిన తర్వాత 1.30- 2 గంటల మధ్య చెంగల్పట్టు జిల్లా పెరుంగళత్తూర్ సమీపంలో ఆగి ఉన్న టిప్పర్ లారీని వీరి కారు ఢీకొట్టింది. దీంతో కారు ధ్వంసం కాగా, అందులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
 
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారి మృతదేహాలను అతి కష్టంపై బయటకు తీశారు. వీరంతా 25-30 ఏళ్ల లోపు వారేనని పేర్కొన్న పోలీసులు వారిని.. రాహుల్ కార్తికేయన్ (పుదుక్కోట), రాజాహరీష్ (మేట్టూరు), అరవింద్ శంకర్ (చెన్నై కేకే నగర్), అజయ్ (తిరుచ్చి), నవీన్ (మేట్టూర్)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు