పేదరికం నుంచి గట్టెక్కిస్తుందనే నమ్మకంతో పెద్దపులులకు ఆహారం అవుతున్నారు

బుధవారం, 5 జులై 2017 (01:59 IST)
పూర్వకాలం మహారాజులు కూడా వారసులకు రాజ్యభారాన్ని అప్పగించిన తర్వాత వానప్రస్థాశ్రమం పేరుతో అరణ్యాలకు వెళ్లి అక్కడే జీవితాన్ని ముగించుకున్నారు. తమ దేహాలను అగ్నికి అర్పించుకునో, క్రూరజంతువులకు అర్పించుకునో చరమాంకాన్ని గడిపేవారు. ఇంకా కొన్ని సమాజాల్లో అయితే రాక్షసులు ఊరిమీద పడుతుంటే ఒప్పందం కుదుర్చుకుని రోజుకు ఒక్కరి చొప్పున ఆ రాక్షసుడికి బలి అవుతూ జాతిని కాపాడుకునేవారు. భారతంలో బకాసురుడి కథ ఈ బాపతుదే. కానీ ఈ రోజుల్లో కూడా తమ తెగ లేదా జాతి అడవి తల్లికి త్యాగం చేయడం పేరుతో ప్రాణాలనే పులులకు ఆహారంగా ఇస్తూ ఆత్మార్పణం చేసుకుంటున్నారంటే నమ్మశక్యం కాదు కాని ఇది నిజం.
 
భారత్‌-నేపాల్‌ సరిహద్దుకు చేరువలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పిలిభిత్‌ టైగర్వ్‌ రిజర్వ్‌కు చేరువలో నివసిస్తున్న గ్రామాలు ఒక వింత ఆచారాన్ని పాటిస్తున్నాయని చాలా ఆలస్యంగా తెలిసింది. అడవి తల్లిపై ఆధారపడి సాగించే జీవితం. తల్లి నుంచి తీసుకున్న దానిలో కొంత తిరిగి ఇచ్చేయమని చెబుతుంది వారి ఆచారం. అడవి తల్లికి ఇవ్వడానికి వారి దగ్గర ఉంది ప్రాణాలే. కుటుంబానికి ఒకరు చొప్పున స్వయంగా అడవిలోకి వెళ్లి పులులకు ఆహారంగా మారుతూ ఆత్మార్పణ చేసుకుంటున్నారు.
 
2016 ఫిబ్రవరి నుంచి దాదాపు ఏడుగురు పెద్ద వయసు గల వ్యక్తులు పులులకు ఆహారంగా మారిన ఆనవాళ్లు అటవీ శాఖ అధికారులకు దొరికాయి. పులులు మనుషులను చంపడంపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన అధికారి వెల్లడించిన వివరాలు అటవీ శాఖ అధికారులను షాక్‌కు గురి చేశాయి. అడవి లోపల చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన వస్తువులు కూడా దొరికాయి. ఈ సంఘటనలపై వైల్డ్‌ లైఫ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) దర్యాప్తుకు ఆదేశించింది. 
 
అడవి చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలే స్వచ్చందంగా పులులకు ఆహారంగా మారుతున్నారని ఆయన చెప్పారు. అడవి తల్లి తమను పేదరికం నుంచి గట్టెక్కిస్తుందనే నమ్మకంతోనే కుటుంబ పెద్దలు ఒక్కొక్కరిగా ప్రాణాలు త్యాగం చేస్తున్నారని వెల్లడించారు.
 

వెబ్దునియా పై చదవండి