తబ్లీగి కార్యకర్తలకు ఐదేళ్ళ జైలు శిక్ష : ఢిల్లీ సర్కారు ప్రతిపాదన

బుధవారం, 27 మే 2020 (11:22 IST)
వీసా నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణభూతులుగా ఉన్న తబ్లీగి కార్యకర్తలకు ఐదేళ్ళ వరకు జైలుశిక్ష విధించవచ్చని ఢిల్లీ హైకోర్టుకు ఆ రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. 
 
గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్ వేదికగా తబ్లీగి మర్కజ్ మీట్ జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ముస్లిం ప్రతినిధులు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి అనేక మంది ముస్లింలు హాజరయ్యారు. ఇక్కడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాపించినట్టు తేలింది. 
 
ముఖ్యంగా, ఈ మతపరమైన కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి టూరిస్ట్, ఈ-వీసాలపై సుమారుగా 960 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించి, మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి వారందరికీ ఐదు సంవత్సరాల వరకూ జైలుశిక్ష విధించవచ్చని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. 
 
కాగా, ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విదేశీయులను విడిచి పెట్టాలని దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టగా, ఈ సందర్భంగా పోలీసులు తమ వాదనను వినిపించారు. వీరంతా వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారేనని, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి, దేశంలో కరోనా వ్యాప్తికి కారకులయ్యారని, వీరు ఇండియన్ ఫారినర్స్ యాక్ట్, సెక్షన్ 14 ప్రకారం నేరస్తులేనని పేర్కొన్నారు. 2019 నాటి వీసా మాన్యువల్ విధానాలను పాటించలేదని స్పష్టంచేశారు.
 
టూరిస్ట్ వీసాలపై వచ్చిన వారు విశ్రాంతి తీసుకోవడం, సైట్ సీయింగ్, స్నేహితులు, బంధువులను కలుసుకోవడం వంటి పనులకు మాత్రమే పరిమితం కావాల్సి వుందని, స్వల్ప వ్యవధి యోగా కార్యక్రమాలకు, మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చని, అంతవరకే పరిమితం కావాలని, మరే ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని కోర్టుకు పోలీసులు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు