పాపం టీఎన్.శేషన్ దంపతులు.. పిల్లలు లేకపోవడంతో....

సోమవారం, 15 జనవరి 2018 (08:34 IST)
దేశ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టి రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిన అధికారి టీఎన్.శేషన్. ప్రస్తుతం ఈయన వృద్ధాశ్రమంలో జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలు లేకపోవడంతో తన భార్య జయలక్ష్మితో కలిసి చెన్నైలోని గురుకులం వృద్ధాశ్రమంలో శేషజీవితం గడుపుతున్నారు.
 
ఈయన పుట్టింది కేరళ రాష్ట్రం పాలక్కాడు జిల్లా తిరునెల్లై గ్రామం. ఐఏఎస్ అధికారిగా సర్వీసు చేసింది మాత్రం తమిళనాడులో. ఈయన పూర్తి పేరు తిరునెల్లై నారాయణ అయ్యర్‌ శేషన్‌. వయసు 85. భారత ఎన్నికల సంఘానికి 10వ ప్రధానాధికారిగా 1990 నుంచి 1996 మధ్యకాలంలో పని చేశారు. 
 
ఈ సమయంలోనే ఎన్నికల సంఘంలో అనేక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అక్రమాలకు పాల్పడబోయిన రాజకీయ ఉద్ధండులకు తన నిర్ణయాలతో చుక్కలు చూపించారు. ఆయన సంస్కరణలతోనే ఎన్నికల వ్యవస్థలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 
 
1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్‌ నారాయణన్‌పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఈసీగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆయనకు తన స్వగ్రామంలో సొంత ఇల్లు ఉంది. అయితే, తమను సంరక్షించేందుకు పిల్లలు లేకపోవడంతో శేషన్‌ దంపతులు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. 
 
ఆశ్రమంలోని తోటివారి కష్టాలను వింటూ, వారికి చేతనైన సాయం అందిస్తున్నారు. తన సర్వీసు పింఛను డబ్బుల్లో కొంత సామాజిక సేవలకు ఖర్చు చేస్తున్నారు. ఈ ఆశ్రమంలో తన తోటివారి సమక్షంలో అత్యంత నిరాడంబరంగా గత నెల 15వ తేదీన తన 85వ పుట్టినరోజును ఆయన జరుపుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు