కాంగ్రెస్ నేతలు రూ.3 వేలు ఇస్తే.. మేం రూ.6 వేలు ఇస్తాం : బీజేపీ నేత

సోమవారం, 23 జనవరి 2023 (10:58 IST)
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. పైగా, ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు పోటాపోటీగా డబ్బులు పంచేందుకు సిద్ధపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక బీజేపీకి చెందిన నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.3 వేలు చొప్పున ఇస్తే తాము (బీజేపీ) మాత్రం ఓటుకు రూ.6 వేలు చొప్పున అందజేస్తామని తెలిపారు. 
 
ఆ బీజేపీ నేత పేరు రమేష్ జార్కిహోళి. మాజీ మంత్రి కూడా. బెళగావిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థు హోల్‌సేల్ మార్కెట్‌లో టిఫిన్ బాక్సులు, కుక్కర్లను చౌకగా కొనుగోలు చేసి పంచుతున్నారన్నారు. మరికొన్ని కూడా పంచే అవకాశం ఉందని తెలిపారు. వాటి విలువ మహా అయితే, రూ.3 వేలు ఉండవన్నారు.
 
అయితే, తాము మాత్రం రూ.6 వేలు చొప్పున ఒక్కో ఓటుకు ఇస్తామని తెలిపారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. కాగా, సెక్స్ స్కామ్‌లో చిక్కుకున్న ఈయనగారు గత 2021లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ మాజీ మంత్రి రమేష్ చేసిన వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ కర్నాటక శాఖ స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు