'ఉచితాల'తో ప్రజలను సోమరిపోతులు చేస్తున్న పార్టీలు.. హైకోర్టు సీరియస్!

గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:16 IST)
ఎన్నికల్లో విజయం సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలు గెలవడానికి వాడుకునే ప్రధాన ప్రచారాస్త్రం... ఉచితాలు. అది ఉచితంగా ఇస్తాం... ఇది ఉచితంగా ఇస్తాం అంటూ దాదాపు అన్ని పార్టీలు హామీలు ఇస్తుంటాయి. తమిళనాడులో అయితే దీని మోతాదు మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
 
తాజా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రకటించిన ఉచిత హామీలపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల ద్వారా ప్రజలను మరింత సోమరిపోతులుగా మారుస్తున్నరంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇలా చేయడం కన్నా.. ఉద్యోగాల సృష్టి, ఆరోగ్యం, రవాణా, మౌలిక సదుపాయాల కల్పనపై రాజకీయ పార్టీల దృష్టిసారించాలని సూచించింది. 
 
ఉచిత పథకాల వల్ల ఏ పని చేయకపోయినా, ఎలాగైనా బ్రతికేయచ్చు అని ప్రజలు భావిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. ఇక అధికారంలోకి వచ్చేందుకు ప్రకటించిన హామీలను నెరవేర్చని పార్టీల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 
 
ఉచితాలను అందిస్తూ ప్రజలను మరింత బద్ధకస్తులుగా చేస్తున్నారని హైకోర్టు విమర్శించింది. హామీల విషయంలో అన్ని పార్టీలు ఇతర పార్టీల కంటే మెరుగ్గా ఉండేందుకే ప్రయత్నిస్తాయని తెలిపింది. ఇది ప్రజలు కష్టపడే మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది.
 
ప్రభుత్వం అందించే ఉచిత సేవలతో బతికేయొచ్చనే అపోహలు ప్రజల్లో కలుగుతున్నాయని తెలిపింది. దీనికి బదులు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పింది. దురదృష్టవశాత్తు పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలకు ఉద్యోగాల సృష్టి, అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు