గౌరీ లంకేశ్‌ను ఎలా చంపారంటే...

గురువారం, 7 సెప్టెంబరు 2017 (11:35 IST)
కర్ణాటక రాజధాని బెంగుళూరులో సీనియర్ జర్నలిస్టు, హక్కుల కార్యకర్త గౌరీ లంకేశ్ (55) దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈమె హత్య ఎలా జరిగిందన్న అంశంపై సీసీటీవీ ఫుటేజీల ద్వారా బహిర్గతమైంది. తన విధులు ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు గౌరీ లంకేశ్‌పై ఈ దాడి జరిగింది. కారును పార్కింగ్ స్థలంలో పెట్టి ఇంట్లోకి వెళ్లబోతుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. 
 
దుండగులు ఏడు బుల్లెట్లు కాల్చగా ఆమెకు మూడు తగిలాయని, వాటిలో ఒకటి తలలోకి దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. మిగిలిన నాలుగు బుల్లెట్లు ఇంటి గోడలకు తగిలాయన్నారు. ఆమెకు తగిలిన బుల్లెట్లలో రెండు ఛాతీలోకి ఒకటి నదురులోకి దూసుకెళ్లిందని బెంగళూరు పోలీస్ కమిషనర్ టీ సునీల్‌కుమార్ వివరించారు. 
 
గౌరిపై కాల్పులు జరిపిన ముగ్గురు దుండగుల్లో ఒకడిని సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు గుర్తించినట్టు సమాచారం. గౌరిపై కాల్పులు జరిపింది కిరాయి హంతకులని, వారిని పట్టుకొనేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని గౌరి కుటుంబం డిమాండ్ చేసింది. గౌరి హత్యపై ఒక నివేదిక పంపాలని కేంద్ర హోం శాఖ కర్ణాటక సర్కార్‌ను ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు