పొత్తులపై రెండు రోజుల్లో శుభవార్త చెబుతాను : కమల్ హాసన్

వరుణ్

సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (12:04 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తులపై వచ్చే రెండు రోజుల్లో శుభవార్త చెబుతానని అగ్రహీరో కమల్ హాసన్ అన్నారు. ఆయన విదేశాల నుంచి సోమవారం ఉదయం చెన్నైకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నామని, తమకు మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని రెండురోజుల్లో ప్రకటిస్తామని చెన్నై ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తన తదుపరి చిత్రం 'థగ్‌ లైఫ్‌' కోసం అమెరికా వెళ్లిన ఆయన.. సోమవారం తిరిగివచ్చారు. 
 
ఈ ఎన్నికల్లో అధికార డీఎంకే -మక్కల్ నీది మయ్య మధ్య పొత్తుపై వార్తలు వస్తున్నాయి. దీని గురించి కొద్దినెలల క్రితం డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సూచనప్రాయంగా వెల్లడించారు. అలాగే 'సనాతన ధర్మం'పై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సమయంలో కమల్‌ మద్దతుగా నిలిచారు. గత ఏడాది జరిగిన ఈరోడ్‌ ఉప ఎన్నికలో డీఎంకే నిలబెట్టిన అభ్యర్థిని ఎంఎన్‌ఎం బలపరిచింది. 
 
డైరెక్టర్ శంకర్ కుమార్తెకు మళ్లీ పెళ్లి... అసిస్టెంట్ డైరెక్టరుతో నిశ్చితార్థం 
 
ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకు మళ్లీ పెళ్లి జరుగుతుంది. మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె.. సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌ను వివాహం చేసుకోనున్నారు. వీరి వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఆదివారం చెన్నై నగరంలో జరిగరింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఐశ్వర్య సోదరి, సినీ హీరోయిన్ అదితి శంకర్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 'ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన ఇద్దరు వ్యక్తులతో నేను.. మరిచిపోలేని రోజు ఇది' అని తన సోదరి, సోదరుడు అర్జిత్‌ను ఉద్దేశించి క్యాప్షన్ పెట్టారు.
 
వైద్యురాలైన ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. 2021లో క్రికెటర్ రోహిత్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అప్పట్లో రోహిత్‌పై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో అతని నుంచి ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఇపుడు తరుణ్ కార్తీక్‌ను వివాహం చేసుకోనున్నారు. తరుణ్.. శంకర్ సినిమాలకూ సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నారు. 
 
శంకర్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న 'భారతీయుడు 2', రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న 'గేమ్ ఛేంజర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 'విరుమన్'తో 2022లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన అదితి ఆ తర్వాత 'మావీరన్'లో నటించారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. అదితి మంచి సింగర్ కూడా. తాను నటించిన సినిమాల్లోని కొన్ని పాటలే కాకుండా వరుణ్ తేజ్ హీరోగా తెలుగులో తెరకెక్కిన 'గని'లోని 'రోమియో జూలియట్' సాంగ్ ఆలపించి అలరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు