వైద్యం చేయడాన్ని మానవసేవగా కాకుండా మంచి లాభసాటి వ్యాపారంగా భావించే ఈ రోజుల్లో తమ అమ్మలా మరెవరూ బాధపడకూడదని, ప్రజలందరికీ తక్షణ వైద్యం అందుబాటులో ఉండేలా కేవలం ఒక్క రూపాయి ఫీజుగా ఐదు క్లినిక్లకు శ్రీకారం చుట్టారు సోదరులైన రాహుల్, అమోల్ అనే ఇద్దరు వైద్యులు. ఇదేదో ఆషామాషీగా కాదు... ప్రతి క్లినిక్లో నలుగురు ఎంబిబిఎస్ డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండగా, ఎమ్డి స్థాయి వైద్యుడు రోజులో నాలుగు గంటలపాటు సేవలందిస్తారు.
ముంబైలోని దాదర్, కుర్లా, ఘట్కోపర్, ములుంద్, వాదాలా రోడ్లలో ఈ క్లినిక్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వీరు ఈ సంవత్సరం ఆగస్టు నాటికి మరో 19 క్లినిక్లను నగరంలోని వేర్వేరు చోట్ల ప్రారంభిస్తామని తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే రైళ్లలో ప్రయాణించేవారికి, ప్రమాదాల బారిన పడినవారికి తక్షణమే ప్రాథమిక వైద్యసాయం అందించడమే తమ ముఖ్యోద్దేశమని ఈ డాక్టర్ సోదరులు చెప్పారు.
ఈ ఒక్క రూపాయి క్లినిక్ ఆలోచన గురించి మాట్లాడుతూ - తమ చిన్నతనంలో ప్రమాదంలో గాయపడిన అమ్మ ఆర్నెల్లపాటు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ పక్షవాతం బారిన పడిందని, అలాంటి ఇబ్బంది వేరెవరికీ కలగకుండా ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణ వైద్యసాయం అందించాలనుకుంటున్నామని వీరు తెలిపారు.
రక్తం, సోనోగ్రఫీ మరియు ఇతర పరీక్షలకు సాధారణ ఛార్జీల కంటే 40 శాతం తక్కువ మొత్తాన్ని వసూలు చేస్తున్న అమోల్, రాహుల్ ఈ క్లినిక్లన్నింటినీ తమ స్వంత నిధులతోనే నిర్వహించడం మరింత విశేషం. ఈ ముంబై సోదరుల ప్రేరణతో మరింతమంది వైద్యులు ప్రజాసేవకు ముందుకు రావాలని ఆశిద్దాం.