హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బదోలీ, సింగర్ జై భగవాన్ అలియాస్ రాకీతో కలిసి హిమాచల్ ప్రదేశ్, సోలాన్ జిల్లాలోని కౌశాలిలోని ఓ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాల మేరకు.. బాధితురాలు తన బాస్, స్నేహితుడితో కలిసి హోటల్లో ఉండగా 2023 జులై 3వ తేదీన నిందితులు ఆమెను కలిశారు. బదోలీ తనను తాను రాజకీయ నేతగా, రాకీ సింగర్గా పరిచయం చేసుకున్నారు.
ఈ క్రమంలో ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బదోలీ, తన మ్యూజిక్ ఆల్బమ్స్లో చాన్స్ ఇస్తానని రాకీ బాధితురాలికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె తన స్నేహితుడితో కలిసి వారి గదిలోకి వెళ్లింది. అక్కడ ఆమెతో వారు బలవంతంగా మద్యం తాగించే ప్రయత్నం చేశారు.
అయితే, మద్యం సేవించేందుకు ఆమె అంగీకరించకపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. లైంగికదాడి ఘటనను వారు వీడియోలు, ఫొటోలు తీశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
రెండు నెలల క్రితం రాకీ తనను పంచకులలోని ఆయన ఇంటికి పిలిచాడని, తప్పుడు కేసులో జైలుకు పంపుతానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.