మహిళా ఏసీపీ చేతి వేళ్లను నరికేసిన వ్యాపారి... ఎక్కడ?

బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:45 IST)
ఓ వ్యాపారి పట్టరాని కోపం వచ్చింది. అంతే.. ఓ మహిళా ఏసీపీ చేతి వేళ్లను నరికేశాడు. అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను ఖాళీ చేయించేందుకు వెళ్లిన పోలీసులపై కూడా దౌర్జన్యం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు కొందరు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి పాదాచారులతో పాటు.. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారాయి. దీంతో ఈ దుకాణాలను ఖాళీ చేయించాలని థానే మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. 
 
ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి దుకాణాలు, తోపుడు బండ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్‌బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇలానే దుకాణాలు ఖాళీ చేయిస్తుండగా కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కల్పితా పింపుల్‌పై కత్తితో దాడిచేశాడు. 
 
ఈ ఘటనలో ఆమె మూడు వేళ్లు తెగిపోయాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఏసీపీతోపాటే ఉన్న సెక్యూరిటీగార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు అమర్జీత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు