మా తల్లి వద్ద బోరున ఏడ్చారు.. పోరాడేందుకు శక్తి చాలడం లేదని బీజేపీలో చేరారు : రాహుల్ గాంధీ

ఠాగూర్

సోమవారం, 18 మార్చి 2024 (11:37 IST)
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన గురించి అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశోక్ చవాన్.. తన తల్లి సోనియా గాంధీ వద్దకు వచ్చి బోరున ఏడ్చేశారు. వారితో పారాడేందుకు నాకు శక్తిలేదు. నేను జైలుకు వెళ్ళాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తుంది అని అంటూ కన్నీటి పర్యంతమయ్యారు అని రాహుల్ వెల్లడించారు. 
 
ఆదివారం ముంబైలో జరిగిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన భాజపాపై విమర్శలు గుప్పించారు. 'మనం అధికారంతో పోరాడుతున్నాం. అందులో ఉన్న వ్యక్తులు ఈవీఎం, దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖను దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ నేను పేర్లు ప్రస్తావించదల్చుకోలేదు. మహారాష్ట్రకు చెందిన ఒక సీనియర్ నేత కాంగ్రెస్‌ను వీడారు. ఆయన మా అమ్మతో మాట్లాడుతూ.. 'సోనియాజీ.. వారితో పోరాడేందుకు నాకు శక్తి లేదు. నేను జైలుకు వెళ్లాలనుకోవడం లేదు. ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా అనిపిస్తోంది' అని కన్నీటిపర్యంతమయ్యారు అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. 
 
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు కొందరు ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. వారిలో మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ ఉన్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్‌రా శివసేన(శిందే వర్గం)లో చేరారు. 48 ఏళ్లుగా పార్టీలో ఉన్న బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌ నుంచి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
 
ఇదిలావుంటే.. మణిపుర్‌లోని తౌబాల్‌ జిల్లాలో జనవరి 14న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 100కిపైగా జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాల మీదుగా కొనసాగింది. 63 రోజుల అనంతరం ముంబయి చేరుకుంది. ఆదివారం ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి ‘ఇండియా’ కూటమికి చెందిన ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ గైర్హాజరయ్యారు. ఈ సభపై భాజపా విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్‌తో నిలబడాలని ఎవరూ కోరుకోరని ఎద్దేవా చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు