ఐదు నెలల పాటు ఇంట్లోనే కుమారుడి మృతదేహం.. ఆ తర్వాత..?

శనివారం, 31 జులై 2021 (14:23 IST)
ఓ మహిళ తన కుమారుడి మృతదేహాన్ని ఐదు నెలల పాటు ఇంట్లోనే ఉంచుకుంది. ఆ తర్వాత ఉరివేసుకుని తన ప్రాణాలను తీసుకుంది. ఈ షాకింగ్ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా ప్రాంతంలో చోటుచేసుకుంది. మూఢ నమ్మకాలపై విశ్వాసంతోనే ఆమె ఇలా చేసిందని స్థానికులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. చంబాలోని పంగి పరిధిలోని రేయి పంచాయతీ పరిధిలో 40 ఏళ్ల ప్యార్ దేయి నివాసం ఉంటుంది. ఆమె కొడుకు ప్రేమ్ జీత్ నాలుగైదు నెలల కిందట మరణించాడు. కానీ ఆమె తన కొడుకు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. అతీత శక్తుల మీద నమ్మకంతో.. అతడు తిరిగి బతుకుతాడని భ్రమలో ఉండిపోయింది. అందుకే అంత్యక్రియలు కూడా పూర్తి చేయలేదు. 
 
అయితే ఉన్నట్టుఉండి ఇటీవల ఆమె కూడా పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు ఆమె భర్త.. వారి 19 ఏళ్ల కూతురుని ఆదివారం చంబా మెడికల్ కాలేజ్‌కు చికిత్స కోసం తీసుకెళ్లాడు. దీంతో అతనికి ఇంట్లో భార్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలియదు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇంట్లో రెండు మృతదేహాలు ఉన్నాయి. అయితే కొడుకు శరీరం మాత్రం పూర్తిగా ఆస్తిపంజరంలా మారి ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారు. వెంటనే ధర్మశాల నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు చెందిన బృందం అక్కడికి చేరుకుంది.
 
ఈ ఘటనపై చంబా ఎస్పీ అరూల్ కుమార్ స్పందిస్తూ.. ఇందుకు సంబంధించి మృతుల కుటుంబ సభ్యుల, బంధువులతో పాటు చుట్టుపక్కల వాళ్లను ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పారు. అయితే ఈ కుటుంబం గ్రామస్తులతో గత మూడు నాలుగేళ్ల నుంచి మాట్లాడటం లేదని స్థానికులు తెలిపారు. ప్యార్ దేయి తనను తాను దేవతగా భావించేదని వారు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు