కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైనది : సుప్రీంకోర్టు

వరుణ్

సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (09:33 IST)
కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైనదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె సేవలకు డబ్బు రూపంలో వెలకట్టలేనిదని పేర్కొంది. కుటుంబాన్ని తమ సంసాదనతో పోషించే వ్యక్తులతో సమానంగా మహిళల పాత్ర చాలా కీలకమైనదని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 2006లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుటుంబానికి రూ.2.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని మోటారు ప్రమాద క్లెయిముల ట్రైబ్యునల్ ఆదేశించింది. 
 
అయితే, తమకు మరింత పరిహారం ఇప్పించాలని కోరుతూ మృతురాలి కుటుంబం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మృతురాలు మహిళ కావడం వల్ల అంతకంటే ఎక్కువ పరిహారం ఇప్పించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. కనీస జాతీయ ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరిహారాన్ని నిర్ధారిస్తుంటారని గుర్తుచేసింది. దాంతో మృతురాలి కుటుంబం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ నిర్వహించి.. ఈ నెల 16న తీర్పు వెలువరించింది. 
 
హైకోర్టు వ్యాఖ్యలతో అందులో విభేదించింది. 'కుటుంబంలో కొందరి ఆదాయంపైకి కనిపిస్తుంది. వారిలాగే కుటుంబంలో గృహిణి పాత్ర కూడా చాలా కీలకం. ఇంట్లో ఆమె చేసే పనులను ఒక్కొక్కటీ గణించుకుంటూ పోతే.. ఆమె సేవలు అమూల్యమైనవి, ఉన్నతమైనవి అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. వాస్తవానికి ఆమె సేవలను డబ్బు రూపంలో కొలవడం కష్టం' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రోజుకూలీ స్థాయిలో గృహిణి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతురాలి కుటుంబానికి ఆరు వారాల్లోగా రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని వాహన యజమానిని ఆదేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు