నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

ఠాగూర్

గురువారం, 24 ఏప్రియల్ 2025 (15:56 IST)
కాశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన భరత్ భూషణ్ ఉన్నారు. ఈయన గడిపిన ఆఖరు క్షణాలను ఆయన భార్య వెల్లడించారు. భర్త భరత్ భూషణ్ మరణాన్ని అతి సమీపం నుంచి చూసిన భార్య సుజాత అంతులేని వేదనకు గురవుతున్నారు. ఏప్రిల్ 22వ తేదీన తన కళ్లముందు జరిగిన విషాదాన్ని తనను ఓదార్చేందుకు వచ్చిన కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు వివరించారు. 
 
"ఏప్రిల్ 18వ తేదీన కాశ్మీర్‌ లోయకు వెకేషన్‌‍కు వెళ్లాం. పహల్గామ్ మా పర్యటనలో చివరి ప్రాంతం. గుర్రాలపై మేం బైసరన్‌కు చేరుకున్నాం. అక్కడికి వెళ్లిన తర్వాత కాశ్మీరీ దుస్తులు ధరించి ఫోటోలు తీసుకున్నాం. మా పిల్లాడితో ఆడుకున్నాం. అపుడే ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించాయి. పక్షులు, అడవి జంతువులను వెళ్ళగొట్టేందుకు ఆ శబ్దాలు చేస్తున్నారని తొలుత భావించాం. కానీ రానురాను ఆ శబ్దం మాకు దగ్గరైంది. అది దాడి అని అర్థమైంది. 
 
కానీ మేం దాక్కునేందుకు ప్లేస్ లేకుండా పోయింది. బైసరన్ ఒక పెద్ద మైదానం. మేం సరిగ్గా మధ్యలో ఉన్నాం. చివరకు టెంట్ల వెనక్కి వెళ్లాం. అవి కూడా మైదానం మధ్యలోనే ఉన్నాయి. మేం అక్కడ దాక్కున్నా.. ఏం జరుగుతుందో మాకు కనిపించింది. అదంతా ఓ భయానకరంగా అనిపించింది. ప్రతి ఒక్కరినీ బయటకులాగి, వివరాలు కనుక్కొని కాల్చివేశారు. మా కళ్లముందే ఒక వ్యక్తిని తలలో గురిపెట్టి రెండుసార్లు కాల్పారు. 
 
అప్పటికే ప్రాణాలు అరచేత పట్టుకుని మేముంటే.. ఒక ఉగ్రవాది నా భర్త వద్దకు వచ్చాడు. ఏమీ ప్రశ్నించకుండానే కళ్లముందే నా భర్తను కాల్చేశాడు. అప్పటికే నా భర్త అతడిని ఎంతో వేడుకున్నారు. నాకో మూడేళ్ల చిన్నపిల్లాడు ఉన్నాడు.. దయచేసి వదిలేయండి బతిమాలాడు. కానీ ఆ ఉగ్రవాది కనికరించలేదు అని ఆమె రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంట తడిపెట్టించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు