అభినందన్‌‌కు ఘన స్వాగతం.. యావత్ భారతం ఎదురుచూపు

శుక్రవారం, 1 మార్చి 2019 (13:06 IST)
మరికొద్ది గంటల్లో భారత్‌కు రానున్న వింగ్ కమాండర్ అభినందన్‌కు స్వాగతం పలకడానికి యావత్ భారతం ఎదురు చూస్తోంది. అందరికంటే ముందు భారత సైన్యం ఇప్పటికే వాఘా సరిహద్దు వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం విడుదల చేస్తారని తెలియడంతో చాలామంది ఔత్సాహికులు గురువారం నుంచే వాఘా సరిహద్దుకు చేరుకుంటున్నారు. 
 
దీనితో వాఘా సరిహద్దు వద్ద పండుగ వాతావరణం చోటు చేసుకుంది. భారీ ఎత్తున జనం అక్కడికి చేరుతుండటంతో అక్కడ ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేసారు. ఆర్మీతో పాటు పంజాబ్ పోలీసులు కూడా వాఘా సరిహద్దులో భారీ సంఖ్యలో మొహరించారు. భారత ప్రజల నినాదాలతో వాఘా సరిహద్దు దద్దరిల్లుతోంది.
 
అయితే సరిహద్దు సైన్యంతో పాటు వాయుసేన అధికారులు కూడా అక్కడికి చేరుకుని ఘన స్వాగతం పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రధానమంత్రిని అభ్యర్థించడం విశేషం. కాగా జెనీవా ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ అభినందన్‌ను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయి. ఆ సంస్థ వారు అభినందన్‌ను వాఘా సరిహద్దుకు తీసుకువస్తారని సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు