శ్మశానంలో పడేసిన అరటిపండ్లతో ఆకలి తీర్చుకుంటున్నవైనం.. ఎక్కడ?

గురువారం, 16 ఏప్రియల్ 2020 (08:33 IST)
కరోనా కట్టడి కోసం కేంద్రం దేశంలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. ఇది అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా, దేశంలోని మహానగరాల్లో ఉండే వలస కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో అనేక వేల మంది వలస కూలీలు ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా వీరందరికీ దినకూలీ లేకుండా పోయింది. అదేసమయంలో తమత ఊళ్ళకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేవు. 
 
దీంతో జాతీయ రహదారుల వెంబడి కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో నివశిస్తున్నారు. అలాగే, మరికొందరు రోడ్ల వెంబడి వున్న చెట్ల కింద తలదాచుకుంటున్నారు. ఇలాంటి వారు అన్నపానీయాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. దీనికి నిదర్శనం ఓ శ్మశానవాటికలో పడేసిన కుళ్లిపోయిన అరటిపండ్లను కొందరు వలస కూలీలు ఆరగిస్తున్నారు. ఇది చూసిన వారికి హృదయాలు ద్రవించుకునిపోతున్నాయి. ఈ ఘటన వలస కూలీల దీన స్థితికి అద్దం పడుతోంది. 
 
లాక్‌డౌన్ కారణంగా ఢిల్లీతో పాటు.. అనేక మెట్రో నగరాల్లో వేలాది మంది వలస కూలీలు బందీ అయిపోయారు. వీరంతా కడుపు నింపుకునేందుకు ఆహారం దొరక్క నానా ఇక్కట్లు పడుతున్నారు. కడుపు నిండే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
 
ఈ క్రమంలో కొందరు వ్యాపారులు కుళ్ళిపోయిన అరటిపండ్లను శ్మశానంలో పారబోశారు. వాటిని చూసిన వలస కార్మికులు అక్కడికి చేరుకుని ఎగబడి మరీ వాటిని ఏరుకుని తిని కడుపు నింపుకున్నారు. 
 
మంచిగా ఉన్న మరికొన్నింటిని ఏరుకుని తమతోపాటు తీసుకెళ్లారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ శ్మశానవాటికలో జరిగిన ఈ ఘటన చూసిన వారి కళ్లలో నీళ్లు నింపింది. తమకు రోజూ ఆహారం దొరకడం లేదని, దీంతో దొరికినవాటితోనే కడుపు నింపుకుంటున్నామని కూలీలు బాధతో చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు